భాగ్యనగరం వినాయక చవితి ఉత్సవాల(Vinayaka Chavithi Festival)కు ముస్తాభవుతోంది. ఇప్పటికే మహానగర వీధుల్లో గణనాథుల ఏర్పాట్ల కోసం వీధివీధినా మండపాలు(Ganesh Mandapalu) సిద్ధమవుతున్నాయి. ఇక వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Mahaganpati). ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తైన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి(Sri Vishwasanthi Mahashakti Ganapati) విగ్రహం భక్తులకు దర్శనమివ్వడానికి సిద్ధమైంది. 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి(Khairatabad Ganesh Utsav Samiti), ఈ ఏడాది ప్రపంచ శాంతి సందేశాన్ని అందించేందుకు ఈ భారీ మట్టి విగ్రహాన్ని రూపొందించింది. 1954లో కేవలం ఒక అడుగుతో ప్రారంభమైన ఈ విగ్రహం, ఏటా ఎత్తు పెంచుకుంటూ దేశంలోనే అత్యంత ఎత్తైన గణపతి విగ్రహంగా రికార్డు సృష్టించింది.
![]()
150 మంది కళాకారులు 84 రోజుల పాటు శ్రమించి
తమిళనాడు, ఒడిశా నుంచి వచ్చిన 150 మంది కళాకారులు 84 రోజుల పాటు శ్రమించి, 30 టన్నుల ఇనుము, 1,000 సంచుల మట్టి, 70 సంచుల బియ్యం తొక్కతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 28 అడుగుల వెడల్పుతో, మూడు తలలు, ఎనిమిది చేతులతో, ఐదు పడగల ఆదిశేషుడి నీడలో రూపుదిద్దుకుంది. గణపతి చుట్టూ శ్రీ జగన్నాథుడు, లలిత త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవి విగ్రహాలు ఉన్నాయి.
#KhairatabadGanesh2025 is Ready..#KhairthabadGanesh#BadaGanesh#GaneshChaturthi2025 pic.twitter.com/BUdPJWPHt2
— SHRA.1 ✍ (@shravanreporter) August 25, 2025
రేపు మహాగణపతికి తొలి పూజ
ఈ ఏడాది కర్రపూజతో విగ్రహ నిర్మాణం జూన్ 6న ప్రారంభమై, ఆగస్టు 25న నేత్రావిష్కరణ అనంతరం ‘బడా గణేశ్ ఆగమన్(Bada Ganesh Aagaman)’ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. డీజే బీట్స్, మరాఠీ బ్యాండ్, సంప్రదాయ తాళాలు, డోలు వాయిద్యాలతో గణపతికి స్వాగతం పలికారు. రేపు (ఆగస్టు 27)న తొలి పూజ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉత్సవాల ప్రారంభోత్సవానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా లక్షలాది భక్తుల తరలిరానుండటంతో సౌకర్యం, భద్రత కోసం పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 6న హుస్సేన్ సాగర్(Hussain Sagar)లో విగ్రహ నిమజ్జనం జరగనుంది.






