ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్టు ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత 5 నెలలకు పైగా తిహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఈడీ, సీబీఐ కేసులో ఆమెకు సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కవిత బెయిల్కు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది.
సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని.. ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని ఈ నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతకుముందు కోర్టులో ఈడీ తరఫున ఏఎస్జీ, కవిత తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
కవిత తరఫున ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. “ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైలులో ఉన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారు:. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలు. కవిత మాజీ ఎంపీ.. ఆమె ఎక్కడికీ వెళ్లారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైంది. సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయి. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత అప్పగించారు” అని ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు.
ఇక ఈడీ తరఫున సుప్రీంకోర్టులో ఏఎస్జీ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని.. ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పనిమనుషులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఫోన్లోని మెసేజ్లను సాధారణంగా అందరూ తొలగిస్తారని.. తాను కూడా తరచూ డిలీట్ చేస్తానని తెలిపారు. ఫోన్లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయితే మెసేజ్లను కాదు.. పూర్తిగా డేటాను ఫార్మాట్ చేశారని వెల్లడించారు. సెల్ఫోన్ డేటాను పూర్తిగా ఫార్మాట్ చేయడం అసాధారణం అని పేర్కొన్నారు. ‘






