విక్టరీ వెంకటేష్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టింది. వెంకీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్స్ లో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది.
రూట్ మార్చిన వెంకీ
ఇక వెంకీ తన నెక్స్ట్ సినిమాపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీతో వెంకీ రూ.300 కోట్లుగా పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో తన తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటి నుంచి ఈ హిట్ల పర్వం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ప్రేక్షకులు మెచ్చే జానర్లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
20 కథలకు నో చెప్పిన వెంకీ
అయితే సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ వద్దకు చాలా కథలు వచ్చాయట. కానీ ఈ విక్టరీ హీరో మాత్రం బ్యాక్ టు బ్యాక్ అవన్నీ రిజెక్ట్ చేసేస్తున్నాడట. దాదాపు 20 కథలు విన్న ఈ దగ్గుబాటి హీరో ఒక్క స్టోరీ కూడా ఓకే చేయలేదట. ఎంత పెద్ద డైరెక్టర్, ప్రొడక్షన్ కంపెనీ అయినా సరే రిజెక్ట్ చేసేస్తున్నాడట. అయితే గతంలో ఎఫ్2, ఎఫ్3 (F3) వంటి ఫ్యామిలీ కామెడీ డ్రామా తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే ప్రయోగాత్మక చిత్రం చేశాడు. కానీ ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.
వెంకీ ప్లాన్ ఏంటి?
ఈ నేపథ్యంలోనే వెంకీ తన నెక్స్ట్ సినిమాను ఆచితూచి ప్లాన్ చేస్తున్నాడు. అయితే వెంకీ సినిమాలు పరిశీలిస్తే ఈ హీరో ప్రయోగాలు చేసిన ప్రతిసారి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ప్రతిసారి బ్రహ్మరథం కట్టారు. వెంకీ అంటే హాయిగా నవ్వులు పంచుతాడు.. లేదా తన నటన, ఎమోషన్స్ తో ఏడిపిస్తాడు అని ఫిక్స్ అయిన ఆడియెన్స్ ఆ జానర్లలో సినిమాలు చేస్తేనే హిట్ ఇస్తున్నారు. మరి వెంకటేష్ ప్రేక్షకుల నాడిని పసిగట్టి వారు మెచ్చే చిత్రాలు చేయాలనుకుంటున్నాడో.. ఇంకా ఏదైనా మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడో తెలియాలంటే తన తదుపరి సినిమా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.






