Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. హనుమాన్ ఫేం, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కక ముందే మోక్షజ్ఞ ఖాతాలో మరో ప్రాజెక్టు వచ్చి చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తండ్రి బాలయ్య బాబు షేర్ చేశారు. ఇంతకీ ఆ సినిమా సంగతులేంటో తెలుసుకుందామా..?
‘ఆదిత్య 369’ సీక్వెల్గా ‘ఆదిత్య 999’
నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్ సినిమా ‘ఆదిత్య 369’ (Aditya 369)కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ 1991లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అందుకుంది. బాలయ్య సినిమాల్లో ఈ చిత్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని అప్పట్లో బాలయ్య ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఆయన ‘ఆదిత్య 369’ సీక్వెల్గా ‘ఆదిత్య 999 (Aditya 999)’ ఉంటుందని తెలిపారు.
ఆదిత్య 999లో హీరోగా మోక్షజ్ఞ
తాజాగా బాలయ్య ఈ సీక్వెల్ విషయాలను పంచుకున్నారు. ఆయన హోస్టుగా చేస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable 4)’ లో ఈ చిత్ర విశేషాలపై మాట్లాడారు. ఆదిత్య 369కు సీక్వెల్గా ‘ఆదిత్య 999’ వస్తుందని.. అందులో తన కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) హీరోగా నటిస్తాడని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుందని వెల్లడించారు. బాలకృష్ణ ఈ విశేషాలు షేర్ చేసుకున్న లేటెస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది.
బాలయ్య కెరీర్లో మైలురాయి ఆదిత్య 369
ఇక ఆదిత్య 369 సినిమా సంగతికి వస్తే.. టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ (Time Travel) నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ, మోహిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో హీరో పాస్ట్, ఫ్యూచర్ లోకి ప్రయాణించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో చూపించారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.కోటిన్నర వరకు ఖర్చయింది. ఈ మూవీ బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది.