ManaEnadu:పశ్చిమ బెంగాల్ లోని కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి (RG Kar Hospital) వైద్యురాలి హత్యాచారం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తవ్వుతున్న కొద్దీ డొంక బయట పడుతోంది. ముఖ్యంగా ఈ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandeep Gosh) ఈ కేసును నీరుగార్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని సీబీఐ అధికారులు ఆరోపించారు. ఏకంగా లైడిటెక్టర్ టెస్టు, లేయర్ట్ వాయిస్ అనాలసిస్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఈ టెస్టుల్లో సందీప్ ఘోష్ కీలక ప్రశ్నలకు మోసపూరితమైన సమాధానం ఇచ్చినట్లు తాము గుర్తించినట్లు సీబీఐ (CBI) అధికారులు వెల్లడించారు. సాక్ష్యాలను రూపుమాపేందుకు యత్నించారనే ఆరోపణలతో సందీప్ ఘోష్పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హత్యాచార కేసుతో పాటు ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా సందీప్ ఘోష్ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది.
ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటల 58 నిమిషాలకు వైద్యురాలిపై హత్యాచారం (Kolkata Doctor Rape Murder) జరిగిందని సమాచారం సందీప్ ఘోష్కు చేరిందని సీబీఐ అధికారులు తెలిపారు. ఘోష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆరోపించారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వైద్యురాలి మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే కొత్త వాదన తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. వైద్యురాలిది అసహజ మరణమని ఆగస్టు 9న రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ రోజు ఉదయం 10 గంటల 3 నిమిషాలకు తాల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మోండల్తో, మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాలకు అడ్వకేట్తో సందీప్ ఘోష్ టచ్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సమాచారం అందినా, వెంటనే ఘటనాస్థలికి చేరుకోకుండా గంట ఆలస్యంగా వెళ్లిన అభిజిత్ మోండల్ను సైతం సీబీఐ అరెస్టు చేసింది.







