పార్లమెంట్ సభ్యులు (MPs), మాజీ ఎంపీల జీతాలు, డైలీ అలవెన్స్, పెన్షన్, అదనపు పెన్షన్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి అందించే జీతాలు, అలవెన్సు, పింఛనులో కీలక మార్పులు చేసింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24శాతం మేర పెంచుతూ నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన జీతాలను 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.
వేతనం ఎంత పెరిగిందంటే?
తాజాగా పెంచిన వేతనాలతో ఒక్కో ఎంపీ జీతం (MP Salary Hike) నెలకు లక్ష రూపాయల నుంచి రూ.1.24 లక్షలకు పెరగనుంది. ఇక సిట్టింగ్ సభ్యుల రోజువారీ భత్యం రూ.2వేల నుంచి రూ.2,500కు పెంచింది. మరోవైపు మాజీ పార్లమెంటు సభ్యులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచింది. అదనపు పెన్షన్ను నెలకు రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.






