Mana Enadu : చదువుకున్న వాళ్లు, చదువులేని వాళ్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, సర్కార్ కొలువులు చేసే ఉన్నతాధికారులు.. ఇలా అందరూ సైబర్ (Cyber Crimes) కేటుగాళ్ల వలలో పడి విలవిలలాడుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా కోల్పోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఉన్న డబ్బంతా సైబర్ నేరగాళ్లు దోచుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరాల గురించి ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా వారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
తాజాగా సైబర్ కేటుగాళ్ల వలలో ఓ సినీ నటి కూడా పడింది. ఓ హీరోయిన్ (Mahima Cyber Crime) ను బురిడీ కొట్టించి ఆమె వద్ద నుంచి డబ్బు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బయట పడింది. హైదరాబాద్ కుందన్ బాగ్ లో సినీ నటి మహిమ నివసిస్తోంది. ఈనెల 6వ తేదీన ఆమెకు రంజన్ షాహీ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఓ నిర్మాతను అంటూ పరిచయం చేసుకున్నాడు. కాసేపటి తర్వాత అతడు అనిత అనే మరో మహిళతో మహిమకు ఫోన్ చేయించాడు.
అనిత మహిమకు ఫోన్ చేసి తాను సింటా (Cine And TV Artists Association) హెచ్ ఆర్ డైరెక్టర్ ను అని పరిచయం చేసుకుంది. సింటాలో లైఫ్ టైమ్ పని చేసే ఆఫర్ ఉందంటూ ఆ ఆఫర్ కావాలంటే రూ.50,500 చెల్లించాలని మహిమకు చెప్పింది. ఆ ఆఫర్ తీసుకుంటే మంచి సినిమా ఆఫర్లు వస్తాయని భావించిన మహిమ అనిత చెప్పిన మాటలు నమ్మేసింది.
అలా మూడు దఫాలుగా అనిత చెప్పిన బ్యాంక్ అకౌంటుకు నగదు బదిలీ చేసింది. అయినా కూడా మళ్లీ డబ్బు అడగడంతో మహిమకు వారిపై అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ హెల్ప్లైన్ నంబర్ (Cyber Help Line Number) 1930కి కాల్ చేసి జరిగిందంతా చెప్పడంతో పోలీసులు రూ.20,200 సైబర్ కేటుగాళ్ల ఖాతాల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేశారు. మహిమ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిమ మంచు విష్ణు నటించిన మోసగాళ్లు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.






