Mana Enadu : ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్(Exit Polls 2024) పైనే అందరి దృష్టి నెలకొంటుంది. కాస్త అటూ ఇటూ అయినా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎన్నికల ఫలితాలుగా వెల్లడవుతాయి. ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుని పలు సర్వే సంస్థలు ముందస్తుగానే ఏ పార్టీ, కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేసే ఈ పోల్స్ అంచనాలు కొన్నిసార్లు తలకిందులు కూడా అయ్యే అవకాశాలున్నాయి.
తలకిందులైన ఎగ్జిట్ పోల్స్
ఓటర్ల నాడిని పసిగట్టేవిగా ప్రచారం చేసుకునే ఎగ్జిట్ పోల్స్ తాజాగా మరోమారు దెబ్బతిన్నాయి. ఇటీవలి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో(Parliament Election Results) చతికిలపడ్డట్లే తాజాగా హర్యానా, జమ్ముకశ్మీర్ విషయంలోనూ తలకిందులయ్యాయి.
హర్యానాలో బీజేపీ విజయఢంకా
మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానా(haryana Results 2024)లో కాంగ్రెస్ 50కు పైగా స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్పోల్స్ అంచనాకు వచ్చాయి. బీజేపీ హ్యాట్రిక్కు ఇక బ్రేక్ పడినట్లేనని.. మోదీ అధ్యాయానికి త్వరలోనే ముగింపు కార్డు పడబోతుందనే టాక్ నడిచింది. కానీ ఫలితాలు చూస్తే బీజేపీ 50 మార్కుకు చేరువై వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. కాంగ్రెస్ 37 సీట్లతోనే సరిపెట్టుకుంది.
ఇంతకు ముందు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని ఎగ్జిట్పోల్స్ కాంగ్రెస్ నెగ్గుతుందని చెప్పిన విషయం తెలిసిందే. కానీ చివరకు బీజేపీ విజయఢంకా మోగించింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 350కు పైగా సీట్లతో ఆధిక్యం సాధిస్తుందని అంచనా వేశాయి. కానీ 240 స్థానాలకు పరిమితమైన కమలం పార్టీ మెజారిటీకి అవసరమైన సీట్లను (272) కూడా సొంతంగా సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.






