Mana Enadu : ఎన్నికల బాండ్ల (electoral bonds) పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో పలువురు బీజేపీ బడా నేతలపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. పారిశ్రామిక వేత్తలను ఎన్నికల బాండ్ల పేరిట బెదిరించి పలువురు బీజేపీ నేతలు వారి పార్టీకి 8వేల కోట్లకుపైగా నిధులు సమకూర్చుకున్నట్లు జనాధికార సంఘర్ష సమితి సహాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), బీజేపీ జాతీయనాయకులపై బెంగళూరులో కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ అంశంపై గతంలో తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు ఆదర్శ్ అయ్యర్ వెళ్లగా.. పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆయన ప్రజాప్రతినిథుల కేసుల కోర్టును ఆశ్రయించగా.. ఆయన అభియోగం మోపిన వారిపై కేసు నమోదు చేయాలని తిలక్నగర్ ఠాణా పోలీసులను కోర్టు (Court) ఆదేశించింది.
సీఆర్పీసీ 153 (CRPC 153 Act) కింద విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుల్లో నిర్మలా సీతారామన్ ఏ1గా, దిల్లీలోని ఈడీ అధికారులను ఏ2గా, బీజేపీకి చెందిన జాతీయ ఆఫీస్ బేరర్లు ఏ3గా, కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ ను ఏ4గా, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు (Karnataka BJP President) బీవై విజయేంద్ర ఏ5గా చేర్చారు.
ఈ కేసులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) ఘాటుగా స్పందిస్తూ.. ముడా భూ కేటాయింపుల కేసులో తనను రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టిన బీజేపీ శ్రేణులు.. ఎఫ్ఐఆర్ నమోదైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలని అన్నారు. నిర్మలా సీతారామన్ రాజీనామా చేయడానికి ఎలక్టోరల్ బాండ్ నిధులు ఏమైనా ఆమె వ్యక్తిగత ఖాతాలోకి వెళ్లాయా లేక కాంగ్రెస్ నేతల్లా అధికారాన్ని దుర్వినియోగ పరిచి లబ్ధి పొందారా అని కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై జేడీఎస్ నేత కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి (HD Kumara Swamy) ప్రశ్నించారు.






