బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.650 ఎగబాకి రూ.94,700గా నమోదైంది. వెండి ధరలు(Silver Price) కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,29,900గా ఉంది. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP)లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు, డాలర్తో రూపాయి మారకం విలువలో మార్పులు, స్థానిక డిమాండ్ పెరుగుదల వంటి కారణాలుగా తెలుస్తోంది.
పెరుగుదలతో కొనుగోలుదారుల ఆందోళన
మరోవైపు పండుగలు(Festivals), వివాహ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థానిక జ్యువెలరీ షాపుల్లో కొనుగోలుదారులు ఈ ధరల పెరుగుదలతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బంగారం ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడి(Investment)గా భావించే వారు ఈ ధరలను ఓ సవాలుగా తీసుకుంటున్నారు. మరోవైపు, వెండి ధరలు కూడా గత కొన్ని వారాలుగా స్థిరంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వెండి ఆభరణాలు(Jewellery), వస్తువుల కొనుగోళ్లపై కూడా ప్రభావం పడుతోంది. మార్కెట్ నిపుణులు ధరల ఒడిదొడుకులను గమనిస్తూ కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






