
ఎవడ్రా నన్ను ఆపేది.. తగ్గేదే లే అంటూ బంగారం ధర (Gold Price Today) అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక ఇవాళో రేపో గోల్డ్ రేటు రూ.లక్ష మార్కును తాకుతుందని అంతా భావించారు. కానీ అంత సమయం అక్కర్లేకుండానే ఇవాళ పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి రేటు అక్షరాలా లక్ష రూపాయలకు చేరి సరికొత్త రికార్డును నమోదు చేసింది. దేశంలో గోల్డ్ ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి.
రూ.లక్ష మార్క్ ను తాకిన గోల్డ్
అమెరికా, చైనా మధ్య వాణిజ్య పోరు (US China Economic War), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలు, డాలర్ బలహీన పడడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా పుత్తడి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి సోమవారం 3,405 డాలర్లకు చేరడంతో.. దేశీయంగా లక్ష రూపాయిల మార్కును పసిడి అందుకుంది.
రూ.2వేలు పెరిగిన ధర
సోమవారం ఉదయం రూ.98,350 వద్ద గోల్డ్ రేటు (Gold Price Record) సాయంత్రం 5.30 గంటల సమయానికి 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,016కు చేరింది. శుక్రవారం మార్కెట్ ముగింపు సమయంలో ధరతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలోనూ 10 గ్రాముల బంగారం తొలిసారి రూ.96వేల మార్కు దాటింది.