
సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో (Skill Case Updates) బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు.
జోక్యం అవసరం లేదు
ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. ఏపీ సర్కార్ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు (Supreme Court) సూచించింది.
మీకేం సంబంధం
స్కిల్ కేసులో 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు (AP High Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్ ఇంటర్లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) ఎందుకు ఉంటారని నిలదీస్తూ.. ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ.. ఇంటర్లొకేటరీ అప్లికేషన్ను డిస్మిస్ చేసింది.