భద్రత లేని బడి బస్సులు తొలగించాలి

మన ఈనాడు: ఫిట్ నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న భాష్యం పాఠశాలపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ డిమాండ్ చేశారు. కాప్రా మండలం, సాకేత్ లో గల భాష్యం బ్లూమ్స్ పాఠశాలకు చెందిన బస్సు ఫిట్ నెస్ లేని కారణంగా రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది, దీని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు అన్నారు.

ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని ధ్వజమెత్తారు. ఫీజులతో పాటు విద్యార్థుల బాధ్యత ను సైతం పాఠశాలల యాజమాన్యాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల బస్సులు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.తక్షణమే ఆర్టీఏ అధికారులు స్పందించి పాఠశాలల బస్సులను తనికీ చేయాలని, ఫిట్ నెస్ లేని యెడల బస్సులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేసారు.

Share post:

లేటెస్ట్