ManaEnadu : ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర సర్కార్ తీపికబురు చెప్పింది. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించింది. మొదటి విడతలో వీరికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు.
రేషన్ కార్డే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్లు
మొదటి విడతలో పేదలు, నిరుపేదల విభాగాలు పరిశీలించి ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డే (Ration Card) ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేసింది. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అర్హులైన వారు ఎంత మంది ఉన్నా పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించాయి. రేషన్ కార్డు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో మంజూరు చేస్తాం. రెండో విడత నుంచి ఆ అవకాశం ఉండదు.
పునాది పూర్తి కాగానే రూ.లక్ష
నాలుగు దశల్లో బిల్లులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళల పేరిటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించాయి. లబ్ధిదారులు ఇళ్లను తమకు నచ్చిన డిజైన్లో కట్టుకోవచ్చని పేర్కొన్నాయి. కచ్చితంగా కనీసం 400 చదరపు అడుగుల్లో వంట గది, బాత్రూం, పడక గది ఉండాలని.. నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.5 లక్షలు గ్రీన్ ఛానెల్ (Green Channel) ద్వారా చెల్లింపులు చేస్తామని వివరించాయి. పునాది పూర్తికాగానే రూ.లక్ష.. గోడలు నిర్మాణం అయ్యాక రూ.1.25 లక్షలు.. స్లాబ్ టైంలో రూ.1.75 లక్షలు.. నిర్మాణం పూర్తి అయితే మరో రూ.1 లక్ష చెల్లించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. బ్యాంకు అకౌంట్ ద్వారానే లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు.






