ManaEnadu : హైదరాబాద్ మహానగరం మరో దిల్లీగా మారనుందా.. రోజురోజుకు క్షీణిస్తున్న వాయు నాణ్యతను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నగరంలో డీజిల్ ఆటోలు నిబంధనలకు విరుద్దంగా శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు పెరిగి, వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది.
చెప్పినా వినరే
నగరంలో 95 శాతం సీఎన్జీ లేదా ఎల్పీజీ ఆటోలు నడుస్తున్నాయి. శివార్లలో డీజిల్ ఆటోలకు బదులుగా సీఎన్జీ, పీఎన్జీ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. డీజిల్ ఆటోలకు బదులు ఎల్పీజీ, సీఎన్జీలు వాడాలని 15 ఏళ్ల కిందటే చెప్పినా.. వాహనదారుల తీరు మారడం లేదు. ఇదే కొనసాగితే దిల్లీ తరహా ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పీసీబీ నివేదిక ప్రకారం
కోకాపేట్, జూపార్కు, శేరిలింగంపల్లి, బాలానగర్, బాచుపల్లి, జీడిమెట్ల, చార్మినార్, ఎంజీబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. కోకాపేట్, జూపార్కు, హెచ్సీయూ, ఇక్రిశాట్, బొల్లారం ప్రాంతాల్లో వాయు నాణ్యత క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోందని ఈ నివేదిక తెలిపింది. పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొంది.
పరిశ్రమలపై పీసీబీ నిఘా
పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, అనలిస్ట్తో కూడిన ఐదు బృందాలను పీసీబీ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఉదయం, రాత్రి వేళల్లో పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నాయి. పరిశ్రమల్లో కాలుష్య కట్టడి, వ్యర్థాల డంపింగ్, ఘాటు వాసనల కట్టడి తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నాయి. ఉదయం ప్రత్యేక బృందాల పర్యవేక్షణతో పాటు రాత్రి నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
ఈ నంబరుకు ఫిర్యాదు చేయండి
ఇక కాలుష్యం, వ్యర్థాల డంపింగ్, ఘాటు వాసనలకు సంబంధించిన ఫిర్యాదులకు 10741 నంబరును సంప్రదించాలని అధికారులు తెలిపారు. ttps://tspcb.cgg.gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. అధికారిక వెబ్సైట్లోని ‘జనవాణి-కాలుష్య నివారిణి’లో సైతం ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.






