ManaEnadu: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ‘మూసీ పునరుజ్జీవం(Musi Riverfront Renaissance)’. మూసీ నది సుందరీకరణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదేలేదని సీఎం రేవంత్(Cm Revanth) ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మూసీ పరీవాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రెడీ అయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా నవంబర్ 8న ఈ పర్యటనకు రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా కుటుంబసమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం YTDA, జిల్లా అధికారులతో కలిసి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.
వలిగొండ టూ బీబీనగర్
కాగా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. వలిగొండ టూ బీబీనగర్ 6 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్(Musi Renaissance Project) ప్రకటించగానే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మూసీకి పునరుజ్జీవం పోసి నల్గొండ ప్రజల కష్టాలు తీర్చుతామని అంటోంది. ఈ క్రమంలో మూసీ వెంట ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకునేందుకునే పాదయాత్ర చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే మిషన్ భగీరథ పథకం(Mission Bhagiratha Scheme)లో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్లైన్ ప్రాజెక్ట్ పైలాన్(Pipeline Project Pylon)ను సీఎం ఆవిష్కరిస్తారు.
ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ
మూసీ పునరుజ్జీవనంపై ముందుకే వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదే నెలలో ఈ ప్రాజెక్టు పనులకు టెండర్లు(Tenders) పిలవనున్నారు. తొలివిడతలో బాపుఘాట్ నుంచి వెనక్కి అంటే గండిపేట, హిమాయత్ సాగర్ వరకు 21KM ఈ పనులు ప్రారంభిస్తారు. అదే సమయంలో మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని మూసీలో కలిపేందుకు అవసరమైన పనులు చేసేందుకు టెండర్లను పిలుస్తారు. GHMC మేయర్, ఇతర అధికారులు అక్టోబర్ మూడో వారంలో దక్షిణ కొరియాలోని సియోల్లో హన్ నది పునరుజ్జీవనాన్ని పరిశీలించి వచ్చిన విషయం తెలిసిందే.






