Mana Enadu : కోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి (RG Kar Hospital)లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన డాక్టర్లు ఇటీవలే ధర్నా విరమించి విధుల్లో చేరారు. అయితే తాజాగా హత్యాచార ఘటన (Kolkata Doctor Rape)కు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఇవాళ (మంగళవారం) తిరిగి ఆందోళన బాట పట్టారు. తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం నుంచి స్పందన లేదు
సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banarjee) చర్చల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని వైద్యులు తెలిపారు. విధులకు శాశ్వతంగా విరమణ తెలిపి ఆందోళనలు (Doctors Protest) కొనసాగించాలని నిర్ణయించామని వెల్లడించారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఇది పూర్తిస్థాయిలో కొనసాగుతోందని స్పష్టం చేశారు. మరోవైపు సెంట్రల్ కోల్కతాలోని స్క్వేర్ కళాశాల నుంచి ధర్మతల వరకు బుధవారం జూనియర్ వైద్యులు మార్చ్కు పిలుపునిచ్చారు.
డాక్టర్ల డిమాండ్లు ఇవే
హత్యాచారానికి గురైన వైద్య విద్యార్థికి న్యాయం చేయాలనేది వైద్య విద్యార్థుల ప్రధాన డిమాండ్. ఆరోగ్య కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ను విధుల నుంచి తొలగించాలనేది మరో డిమాండ్. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాల (Medical Colleges)ల్లో భద్రతా చర్యలు తీసుకోవాలనేది ఇంకో డిమాండ్. ఆసుపత్రుల్లో పోలీసుల రక్షణను పెంచాలని, శాశ్వత మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలనేవి ఇతర డిమాండ్లు.
సుప్రీంకోర్టు ఆదేశాలు
పశ్చిమబెంగాల్లోని ఆర్జీకర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9వ తేదీన జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు దాదాపు నెలకుపైగా రహదారులపై నిరసనలు చేపట్టారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టి వైద్య విద్యార్థులు విధుల్లో చేరాలని సూచించింది.
మళ్లీ ఆందోళనలు
అయినా వైద్యులు ఆందోళన బాట వీడకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైద్యులతో చర్చలు జరిపారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 42 రోజులు కొనసాగించిన నిరసనలు విరమించి గతనెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. ఇక తాజాగా మరోసారి ఆందోళన బాట పట్టారు.






