టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు(Manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa). ఈ కథను ఆధునిక పాన్ఇండియా చిత్రంగా తెరకెక్కించి, ఓ భారీ విజువల్ ట్రీట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మంచు విష్ణు. మోహన్ బాబు(Mohan Babu) కలను నిజం చేస్తూ, ఎన్నో కష్టాల తర్వాత ‘కన్నప్ప’ చిత్రాన్ని పూర్తిచేసిన విష్ణు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ సినిమాలో కన్నప్పగా విష్ణు(Vishnu Manchu) నటించగా, శివుడి అవతారమైన రుద్ర పాత్రలో ప్రభాస్(Prabhas) ప్రత్యేక పాత్రలో మెరిశారు. అయితే ఈ సినిమాలో ప్రధానంగా నిలిచిన అంశం ఏంటంటే.. శ్రీకాళహస్తి శివలింగం. చాలా మందికి ఈ శివలింగం ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో చూపించిన శివలింగ రూపాన్ని పాత భక్త కన్నప్ప సినిమాలోని లింగ రూపంతో పోల్చి చూస్తే అందరికి ఒకటే డౌట్.. ఏంటి శివలింగం ఇలా ఉంది అని. అయితే, మంచు విష్ణు తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన శివలింగ రూపం వెనుక ఓ లోతైన ఆధారముంది. రీసెర్చ్ ఆధారంగా, ప్రామాణిక స్థలపురాణాలను పరిశీలించి, ఆ పరంగా లింగ రూపాన్ని తెరకెక్కించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
మిగతా శివలింగాలకు ఈ వాయులింగానికి ఎందుకు ఈ రూపంలో వ్యత్యాసం అంటే అసలు వాయులింగం(Vayu Lingam) గొప్పతనం ఏంటి అంటే.. వాయులింగం అనేది పంచభూతలింగాలలో నాలుగవది. శివుడు వాయుదేవుడికి వరంగా ఈ స్థలాన్ని ప్రసాదించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. వాయువుకు ఆకారం ఉండదు, ఎటు అయినా ప్రవహించగలదు, ఏ పరిమితులు ఉండవు. అందుకే, శ్రీకాళహస్తిలోని వాయులింగం సాంప్రదాయ శివలింగాలకన్నా భిన్నంగా ఉంటుంది – అది నిలువుగా ఉంటుంది. ఇది ప్రాణశక్తి పైకి ఎగసే తత్వానికి సూచన.
ఈ గర్భగుడిలోని విశేషం ఏంటంటే – లింగం కుడివైపున రెండు దీపాలు ఎప్పుడూ చలించుతూ ఉంటాయని చెబుతారు. ఇది వాయు తత్వానికి మరో గుర్తు. ఇంకా విశేషంగా చెప్పాలంటే.. ఈ స్థలంలో శివుడిని పూజిస్తూ ప్రాణాలు విడిచిన ఏనుగు, పాము, సాలీడు పూజలకు అర్హులయ్యారు. వారిని గౌరవిస్తూ విగ్రహం కిందభాగంలో ఏనుగు దంతాలు, మధ్యలో పాము, వెనుక భాగంలో సాలీడు గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయని కథనాలు ఉన్నాయి.
అంతేకాక, ఈ వాయులింగం స్వయంభూ.. అంటే శివుడు స్వయంగా ఇక్కడే వెలిశారు. అలాగే ఈ విగ్రహాన్ని ఎవరు చేతితో తాకకూడదు. పూజారులు కూడా లింగాన్ని తాకకుండా పూజలు చేస్తారు. శివుడికి ప్రీతికరమైన అభిషేకాలు కూడా ఈ విగ్రహానికి చేయకుండా, కేవలం పీఠానికి మాత్రమే పూజలు చేస్తారు. ఎందుకంటే వాయువుని ఎవరు తాకలేరు అనే నియమం ఎక్కడ ఉంది. ఈ క్షేత్రం యొక్క స్థలపురాణాల ప్రకారం బ్రహ్మకి జ్ఞానం ప్రసాదించిన ప్రాంతం ఇదే. మూడవ శతాబ్దం నుంచే ఈ కాళహస్తి క్షేత్ర ప్రస్తావనలు తమిళ చారిత్రక గ్రంథాల్లో కనిపిస్తున్నాయి.






