భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో తెరకెక్కుతోన్నచిత్రం ‘కన్నప్ప’. భక్తికి గొప్ప స్థానం ఇచ్చే కథా ఆధారంగా చేసుకుని పాన్ ఇండియా చిత్రంగా.. శ్రీశైలానికి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన త్యాగ ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతోంది. క్షత్రియుడిగా జన్మించి, శివభక్తుడిగా మారిన ‘కన్నప్ప’ జీవిత గాధను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు. విజువల్స్ పరంగా ఈ చిత్రం అత్యున్నత స్థాయి విలువలతో రూపొందుతోంది. టైటిల్ పాత్రలో విష్ణు మంచు నటిస్తుండగా, నిర్మాతగా మోహన్ బాబు వ్యవహరిస్తున్నారు.
తాజాగా మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడిన ‘శ్రీకాళ హస్తి’ పాటను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ పాట పాజిటివ్ వైబ్స్ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
అరియానా, వివియానా పాడిన ఈ ప్రత్యేకమైన పాటను బుధవారం (మే 28) నాడు కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా వంటి వారు పాల్గొన్నారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన ఈ పాట భక్తి, భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ సాహిత్యం శ్రీ కాళ హస్తి దైవిక వారసత్వాన్ని అందంగా వివరిస్తుంది.
విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటకు ప్రాణం పోస్తూ ప్రతీ ఒక్కరి హృదయాల్ని తాకేలా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, టాలీవుడ్ రిబెల్ స్టార్ ప్రభాస్ వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టులో భాగమవడం సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ఈ భక్తిరస చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి.






