ManaEnadu : పరమేశ్వరునికి పరమ పవిత్రమైన కార్తిక మాసం (Karthika Masam) ఇవాళ (నవంబర్ 2, శనివారం) ప్రారంభమైంది. ఈ మాసం డిసెంబర్ 1వ తేదీ(ఆదివారం)తో ముగుస్తుంది. తెల్లవారుజామునే శైవాలయాలకు భక్తులు పోటెత్తి దీపారాధన చేశారు. శివకేశవుల ఆరాధనకు విశిష్టమైన ఈ మాసంలో ఎన్నో జన్మల పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలాలు ప్రసాదించే పర్వదినాలు, పుణ్యతిథులు వస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా.. ?
నవంబర్ 2 (శనివారం): కార్తిక శుద్ధ పాడ్యమి – బలిపాడ్యమి, గోవర్ధన పూజ
ఈ రోజు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెనవ్రేలు మీద ఎత్తి, గొడుగులా పట్టుకుని గోకులాన్ని రక్షించిన రోజు.
నవంబర్ 5 (మంగళవారం): కార్తిక శుద్ధ చవితి – నాగుల చవితి
దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి రోజు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతుంటారు.
నవంబర్ 8 (శుక్రవారం): కార్తిక శుద్ధ సప్తమి – కోటి సోమవారం
కార్తీకమాసంలో శుద్ధ సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి వచ్చే రోజును కోటి సోమవారంగా జరుపుకుంటారు.
నవంబర్ 15 (శుక్రవారం): కార్తిక శుద్ధ పూర్ణిమ – కార్తిక పౌర్ణమి, జ్వాలాతోరణం, గురునానక్ జయంతి
కార్తిక పౌర్ణమి రోజున శివకేశవుల ఆలయాల్లో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారు. మరోవైపు అరుణాచలంలో ఆకాశ దీపోత్సవం, సువర్ణముఖి తీర్థ ముక్కోటి, శ్రీ కపిలేశ్వర స్వామికి అన్నాభిషేకం వంటి ఉత్సవాలు జరుగుతాయి.
డిసెంబర్ 01 (ఆదివారం): కార్తిక బహుళ అమావాస్య
డిసెంబర్ 1వ తేదీన కార్తిక మాసం ముగుస్తుంది. అమావాస్య ముగిసి పాడ్యమి వస్తుంది కాబట్టి ఈ రోజు పోలి పాడ్యమిగా జరుపుకుంటారు.






