హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ (Formula E Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటల పాటు ఆయణ్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ (KTR ACB Case).. మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. అధికారులకు అన్ని విధాలా సహకరించానని చెప్పారు. విచారణకు ఎన్ని సార్లు పిలిచినా హాజరవుతానని చెప్పానని వెల్లడించారు.
ఇదో చెత్త కేసు
ఇదొక చెత్త కేసు అని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు కేటీఆర్ (KTR Latest News) అన్నారు. ఆరున్నర గంటల పాటు 4 ప్రశ్నలనే తిప్పి తిప్పి 40 సార్లు అడిగారని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదన్న కేటీఆర్.. ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. పైసలు పంపానని తానే చెబుతున్నానని, ఆ డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని మాజీ మంత్రి ప్రశ్నించారు.
Live: ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
https://t.co/KhdOsT3BAA— BRS Party (@BRSparty) January 9, 2025
తెలంగాణ భవన్ కు కేటీఆర్
ఇక ఏసీబీ విచారణ సమయంలో కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు కూడా ఉన్నారు. కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్ను విచారించినట్లు తెలిసింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ విచారణను పర్యవేక్షించినట్లు సమాచారం. ఈ విచారణను వేరే గది కేటీఆర్ న్యాయవాది రామచంద్రరావు చూసేలా ఏర్పాట్లు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విచారణ అనంతరం కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు.







