
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఈ నెల 15వ తేదీ వరకు పూర్తవుతుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ రేసులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈటల రాజేందర్ (Eatala Rajender), ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind), రామచందర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. తాజాగా మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వారికే ఛాన్స్
రాష్ట్ర శాసనసభాపక్షనేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగుతుండగా.. అధ్యక్ష పదవి (Telangana BJP State President) రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెసుకొచ్చింది అధిష్ఠానం. బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తుండటంతో ఈటల లేదా ధర్మపురి అర్వింద్ (MP Arvind)లో ఒక్కరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని కాషాయ పార్టీ శ్రేణులు అంటున్నాయి.