మహారాష్ట్ర (Maharashtra) శంభాజీ నగర్లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి (aurangzeb tomb)ని తొలగించాలని డిమాండ్ల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం అర్ధరాత్రి నాగ్పుర్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నాగ్పుర్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్థానిక పోలీసు కమిషనర్ రవీందర్ కుమార్ సింగల్ చెప్పారు.
అసలేం జరిగిందంటే..
సోమవారం మధ్యాహ్నం మహల్ ప్రాంతంలో (Nagpur Riots Updates) ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద బజరంగ్దళ్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. చిట్నిస్ పార్క్, శుక్రవారి తలావ్ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా అధికారులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేశారు.
భద్రత కట్టుదిట్టం
నాగ్పుర్లోని హంసపురి ప్రాంతంలో కొందరు దుండగులు వాహనాలకు నిప్పంటించి ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడగా అందులో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.






