
జమ్మకశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో ఇప్పటి వరకు 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ముష్కరుల దాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే ఈ ఉగ్రదాడి ప్రభావం ఇప్పడు సినిమా ఇండస్ట్రీపైనా కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ నటుడు నటించిన బాలీవుడ్ మూవీ అబీర్ గులాల్(Abir Gulaal) ను బ్యాన్ చేయాలని నెట్టింట డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సెగ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు కూడా తగిలింది.
ప్రభాస్-హను మూవీకి సెగ
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫౌజీ (Fauji) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఉగ్రదాడి సెగ తగిలింది. అందుకు కారణం ఇందులో నటిస్తున్న నటి ఇమాన్వీ ఇస్మాయిల్. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన ఇమాన్వీ ఏకంగా పాన్ ఇండియా చిత్రంతోనే అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కించుకుంది. అయితే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కొందరు ఆమెపై గుర్రుగా ఉన్నారు. అందుకు కారణం ఆమె మూలాలు పాకిస్థాన్ లో ఉండటమే.
హీరోయిన్ ను మార్చాలి
ఇమాన్వీ ఇస్మాయిల్(Imanvi Esmail).. పాక్ మాజీ మిలటరీ అధికారి కుమార్తె. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఢిల్లీలో స్థిరపడింది. జన్మతః పాకిస్థాన్ దేశస్తురాలు కావడంతో ఇప్పుడు ఈమెను ప్రభాస్ చిత్రం నుంచి తీసేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉగ్రదాడి తర్వాత పాక్ పేరు కూడా వినడానికి భారతీయులు ఇష్టపడటం లేదు. ఇక ఆ దేశానికి చెందిన వారెవరు ఇండియాలో ఉండకూడదని కేంద్ర సర్కార్ అల్టిమేటమ్ జారీ చేసిన తర్వాత.. నెటిజన్లు మరింత రెచ్చిపోతున్నారు. అందుకే పాక్ నటీనటులెవరూ మన సినిమాల్లో కనిపించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఇబ్బందుల్లో నిర్మాతలు
అయితే ఇప్పటికే ప్రభాస్-హను రాఘవపూడి సినిమా షూటింగ్ ప్రారంభమై.. దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రభాస్ – ఇమాన్వీ (Prabhas Imanvi) మధ్య సీన్లు కూడా షూట్ చేశారు. ఇక త్వరలోనే రిలీజ్ డేట్, వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ కూడా అవుతున్నట్లు సమాచారం. ఈ సమయంలో హీరోయిన్ ను మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు నటీనటులు డేట్స్ అడ్జెస్ట్ చేయాలి.. మరోవైపు అదనపు ఆర్థిక భారం.. అని వాపోతున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.