Mana Enadu : ‘చట్టాలంటే ప్రజలకు భయం గానీ.. గౌరవం గానీ లేవు. రెడ్ సిగ్నల్ (Red Signal) పడితే ఆగరు. హెల్మెట్ పెట్టుకోరు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటే నడుపుతారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.’ అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందని తెలిపారు. కానీ ప్రజల నిర్లక్ష్యం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతూనే వాపోయారు.
నేనూ ప్రమాద బాధితుడినే
రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణ చర్యలపై లోక్సభ (Parliament Sessions)లో అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. తానూ కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తనకు యాక్సిడెంట్ అయి కాలు విరిగిందని.. అందుకే ఈ అంశం తనకు చాలా సున్నితమైందని వెల్లడించారు.
ఈ 4 అంశాలు కీలకం
రోడ్డు ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ (Automobile Engineering), సమర్థంగా చట్టాల అమలు, ప్రజలకు అవగాహన కల్పించడం నాలుగు అంశాలు కీలకమైనవని నితిన్ గడ్కరీ అన్నారు. కానీ చట్టాలంటే ప్రజలకు భయం గానీ.. గౌరవంగానీ లేవని.. తన కళ్లముందే ఓ కారు రెడ్ సిగ్నల్ దాటుకుని వెళ్లిపోయిందని చెప్పారు. హెల్మెట్ ధరించని కారణంగా ఏటా కనీసం 30వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయని గడ్కరీ (Nitin Gadkari) ఆవేదన వ్యక్తం చేశారు.
ఫైన్ వేసినా రూల్స్ పాటించట్లేదు
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా.. ఏటా 1.68లక్షల మంది ప్రాణాలు (Road Accident Deaths) కోల్పోతున్నారని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. చట్టాల అమలు సరిగ్గా లేకపోవడమే దీనికి కారణమని.. ప్రజాప్రతినిధులు, మీడియా, సమాజం నుంచి సహకారం లేకుండా వీటిని తగ్గించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. జరిమానాలు పెంచినా ప్రజలు రూల్స్ పాటించట్లేదని.. దీనిపై లోక్సభలో ప్రత్యేక చర్చ పెట్టాలని ఈ సందర్భంగా గడ్కరీ స్పీకర్ను కోరారు.






