Mana Enadu : దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, హోం మంత్రి అమిత్ షా (Amit Shah), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. మరోవైపు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు.. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నిలిచారు.
60 ఏళ్ల రికార్డు బ్రేక్
2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పని తీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను ఇండియా టు (India Today)డే అంచనా వేసింది. ఈ మేరకు జాబితా రూపొందించింది. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాయడమే గాక.. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ (Ukraine), ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారని తెలిపింది.
మోదీ తర్వాత వీళ్లే పవర్ ఫుల్
మోదీ తర్వాత అత్యంత శక్తిమంతుడిగా అమిత్ షా.. ఈ జాబితాలో దేశంలో మూడో శక్తిమంత నాయకుడిగా గుర్తింపు పొందారు. మరోవైపు వరుసగా రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాను తిరిగి తెచ్చిన నాయకుడిగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తింపు పొందినట్లు తెలిపింది.
పవర్ ఫుల్ సీఎం చంద్రబాబు
దేశంలోని ముఖ్యమంత్రుల్లో పవర్ ఫుల్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఆయన ఆ తర్వాత పలు పరిణామాలతో జైలుకెళ్లారు. 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలా ఎగిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. తర్వాతి స్థానాల్లో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ (Nitish Kumar), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, బంగాల్ సీఎం మమతాబెనర్జీ ఈ జాబితాలో నిలిచారు.






