తాను కూడా వేధింపులకు గురైనట్లు మాలయాళం నటి హనీ రోజ్ (Honey Rose) ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఓ బిజినెస్ మెన్ తనపై వేధింపులకు (Harassment) పాల్పడేందుకు ప్రయత్నించగా.. ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. అయితే దీనిపై చాలా మంది ట్రోలింగ్ చేయగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఉదయం కేరళలోని ఎర్నాకుళం నగర పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు. అందులో కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఆ విమర్శలు స్వీకరిస్తా
‘‘వివరణాత్మక విమర్శలు, నా లుక్స్పై వేసే సరదా జోక్స్, మీమ్స్ను నేనూ స్వాగతిస్తాను. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ, దేనికైనా ఓ హద్దు ఉంటుంది. నాపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తే నేను ఏమాత్రం సహించను. అలాంటి వారిపై న్యాయ పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను. నాకోసం మాత్రమే కాదు మహిళలందరి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నా’’ అని హనీ రోజ్ తన పోస్టు (Honey Insta Post)లో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే
“ఒక వ్యక్తి నన్ను కావాలని అవమానిస్తున్నాడు. నేను సైలెంట్గా ఉంటుంటే ‘అతడు చేసే కామెంట్స్ ను నువ్వు స్వాగతిస్తున్నావా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఆ వ్యక్తి గతంలో కొన్ని ఈవెంట్స్ కు నన్ను ఆహ్వానించాడు. వివిధ కారణాలతో నేను వెళ్లడానికి నిరాకరించాను. ప్రతీకారంగా అతడు నేను వెళ్లే ప్రతి ఈవెంట్కు వచ్చి.. నాపై కించపరిచే కామెంట్స్ చేశాడు.’’ అని ఆమె తెలిపారు. అందుకోసమే ఈ విషయంలో తాను పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ‘వీరసింహా రెడ్డి (Veera Simha Reddy)’తో హనీరోజ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే.







