ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదట్లో ప్రజా సమస్యల గురించి పవన్ చాలా మాట్లాడారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన (Prakash Raj) రాజకీయాలు, ఇతర అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?
అధికారం రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత మరోలా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు తిరుపతి లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy)పై స్పందిస్తూ అది చాలా సున్నితమైన అంశమని.. భక్తుల మనోభావాలకు సంబంధించిందని కాబట్టి సరైన ఆధారాలున్నప్పుడే జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ జరిగితే బాధ్యులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదేం తొలిసారి కాదు
సనాతన ధర్మాని (Sanatana Dharma)కి తాను వ్యతిరేకిని కాదని మరోసారి ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. లడ్డూ వివాదం విషయంలో గతంలోనూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్మీడియా వేదికగా పోస్టులు చేశారు. అయితే ఆయా పోస్టులపై ఆ సమయంలో పవన్ కూడా స్పందించారు. ప్రకాశ్ రాజ్ తనకు మిత్రుడే అయినా ఈ వివాదం విషయంలో ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు.






