గతేడాది 41,138 మంది ఖైదీలు జైలులో ఉన్నారని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నారని.. 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందించినట్లు వెల్లడించారు. జైళ్ల శాఖ వార్షిక నివేదికను ఆమె విడుదల చేశారు. పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నారని చెప్పారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) కేసుల్లో 5,999 మంది పురుషులు, 312 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నట్లు వివరించారు.
చట్ట ప్రకారమే రిలీజ్ చేశాం
2024లో కోర్టు విచారణలో 30,153 కేసులు ఉన్నాయని సౌమ్యా మిశ్రా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 483 మందిని జైలు నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. 303 మందికి పెరోల్ ఇచ్చామని.. ఈ-ములాఖత్ ద్వారా ఖైదీల కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించామని వెల్లడించారు. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పిచ్చినట్లు చెప్పిన డీజీ.. 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విడుదల విషయంలో జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని ఆమె స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే ఆయన్ను విడుదల చేశామని డీజీ సౌమ్యా మిశ్రా అన్నారు.







