హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వెళ్తున్నారా..? ప్రయాణం కోసం వెళ్తే ఓకే.. కానీ ఎయిర్ పోర్టు చూసేందుకు వెళ్లాలనుకుంటే మాత్రం ఈ న్యూస్ తెలుసుకోవాల్సిందే. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 31వ తేదీ వరకు హై అలర్ట్ ప్రకటించారు. అప్పటి వరకు సందర్శకుల గ్యాలరీని మూసి వేస్తున్నందున విజిటర్స్ రావొద్దని GHIAL అధికారులు తెలిపారు.
ప్రత్యేక నిఘా
జనవరి 26 రిపబ్లిక్ డే (Republic Day 2024) సందర్భంగా పోలీసులు విమానాశ్రయం భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ప్రత్యేక పోలీసులతో కలిసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ఎయిర్పోర్టుకు వస్తున్న వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇక రన్ వే పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందిని పెంచి నిఘా పటిష్ఠంగా ఉంచారు.
ఇద్దరికి మించి రావొద్దు
మరోవైపు ఎయిర్లైన్స్ ప్రతినిధులు ప్రయాణికుల సామగ్రిని రెండు దశల్లో సమగ్రంగా పరిశీలించి విమాన సర్వీసులోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు వీడ్కోలు, స్వాగతం పలకడానికి ఇద్దరికి మించి రావొద్దని జీహెచ్ఐఏఎల్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎయిర్ పోర్టులో, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే విమానాశ్రయ సిబ్బందికి లేదా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.







