తమిళ స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. విజయ్ తన వ్యక్తిగత విషయాలపై చాలా రహస్యంగా ఉంటారు. కుటుంబ విషయాలను బయటపెట్టకుండా ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ముఖ్యంగా విజయ్ కుమార్తె దివ్య సాషా గురించి అభిమానుల్లో ఆసక్తి బాగా పెరిగింది. తాజాగా ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దివ్య సాషా(Divya Sasha) బాల్యం నుంచే బ్యాడ్మింటన్ పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ వస్తోంది. ఇటీవల ఆమె స్కూల్ స్థాయిలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకుంది. ఈ విజయం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అంతేకాదు, ఆమె గెలుచుకున్న ట్రోఫీల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. దివ్య గురించి చాలామందికి తెలియని విషయమేంటంటే.. ఆమె చిన్నతనంలోనే వెండితెరపై బాలనటిగా సందడి చేసింది. విజయ్ నటించిన ‘తేరి’ చిత్రంలో చిన్నపిల్లగా కనిపించిన దివ్య, ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ చదువు, స్పోర్ట్స్పై దృష్టి సారించింది.
ఇదిలా ఉండగా, దివ్య బ్యాడ్మింటన్లో మంచి క్రీడాకారిణిగా ఎదుగుతోందని ఓ ఇంటర్వ్యూలో విజయ్ స్వయంగా వెల్లడించారు. చిన్నప్పటి నుంచే ఆమె స్పోర్ట్స్ పట్ల ఆసక్తి చూపుతుందని, స్కూల్ టోర్నమెంట్స్లో మొదటి స్థానాలు సాధించి తన ట్యాలెంట్ను ప్రదర్శించిందని ఆయన పేర్కొన్నారు.
ఇక మరోవైపు విజయ్ కుమారుడు సంజయ్ కూడా తన మార్గాన్ని ఎంచుకున్నాడు. హీరో కాకుండా దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రంలో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా పోస్టర్స్ విడుదలై ప్రేక్షకుల స్పందనను ఆకర్షించాయి. ఈ చిత్రం విజయవంతమైతే సంజయ్ డైరెక్టర్గా కొనసాగతాడా లేదా హీరోగా మారతాడా అన్నది చర్చనీయాంశంగా మారింది.
విజయ్ సినిమాల పరంగా కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన లియో చిత్రం మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం జననాయకన్ అనే కొత్త సినిమాతో సెట్స్ పై ఉన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.






