Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసు (Hyderabad E Formula E Race) వ్యవహారంపై ఏసీబీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ (KTR) హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది.
తీర్పు వచ్చే వరకు అరెస్టు చేయొద్దు
కేటీఆర్ క్వాష్ పిటిషన్పై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు (Telangana High Court) ఈనెల 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేస్తూ ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేయగా.. ఆ తర్వాత విచారణ 31కి వాయిదా పడింది. ఇక ఇవాళ ఇరు వైపుల వాదనలు ముగియగా.. కేటీఆర్ పిటిషన్పై తీర్పును రిజర్వు చేసి.. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.
నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు
అంతకుముందు ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (AG) ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. “ఫార్ములా – ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించారు. సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయి. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలం సేకరించాం. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.” అని కోర్టుకు ఏజీ తెలిపారు.
కేటీఆర్ ఆమోదించారు
దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పురపాలక శాఖ మంత్రి (KTR Case News) పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారు. రేసింగ్కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారు.’ అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అసలు ఈ కేసు ఏంటంటే..?
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో హెచ్ఎండీఏ (HMDA), రాష్ట్ర ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమంతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయని పురపాలక శాఖ కార్యదర్శి దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీటిలో రూ.46 కోట్ల వరకు డైరెక్ట్గా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అని అభియోగం మోపారు. ఈ క్రమంలోనే విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఇందులోకి ఈడీ కూడా చేరింది.








