
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు (Telangana Group 1 Exams) రాసి క్వాలిఫై అయిన విద్యార్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కూడా కానుంది. ఇక తమకు ఉద్యోగాలు వచ్చినట్టేనని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్న సమయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వారికి బిగ్ షాక్ ఇచ్చింది. గ్రూప్-1 నియామకాలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది.
గ్రూప్-1 నియామకాలకు బ్రేక్
ఈ పరీక్షల వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని టీజీపీఎస్సీ(TGPSC)కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. కాగా గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 16, 17, 19, 21వ తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతోంది.
గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్
అయితే గ్రూప్-1 పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు (BRS on Group 1 Exams) ఆరోపించారు. ఈ పరీక్షల్లో చాలా మందికి ఒకే రకమైన మార్కులు వచ్చాయని తెలిపారు. 25 సెంటర్స్లో 10 వేల మంది పరీక్షలు రాస్తే 69 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని.. కోఠి ఉమెన్స్ కళాశాలలోని సెంటర్ 18, 19 కేంద్రాల్లో 1490 మంది రాస్తే వారిలో 74 మంది ఎలా పాసయ్యారని ప్రశ్నించారు. ఏడు వేల మందికి పైగా తెలుగులో పరీక్ష రాస్తే టాప్ 100 ర్యాంకులలో కేవలం నలుగురు మాత్రమే ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకే నెంబర్ సిరీస్ కలిగిన వందలాది మందికి ఒకేలా ఫలితాలు రావడంపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.