Mana Enadu:భారతదేశంలో హిందూ సంప్రదాయ ఆలయాలు లక్షల్లో ఉన్నాయి. అన్ని రకాల దేవుళ్లకు ఇక్కడ గుళ్లున్నాయి. ఆఖరికి రావణాసురుడు, యమధర్మ రాజుకు కూడా ఆలయాలు కట్టి పూజలు నిర్వహించే సంస్కృతి మనది. అయితే వీళ్లంతా దేవుళ్లు.. దేవాంశ సంభూతులు. వీరికి గుడి కట్టడం.. పూజలు చేయడం సర్వసాధారణం. కానీ ఓ భక్తుడు మాత్రం తన భక్తిని కాస్త వెరైటీగా చాటుకున్నాడు. ఇప్పటికే ఉన్న లక్షల మంది దేవుళ్లెవరూ తనకు అభయమివ్వడం లేదనుకున్నాడో ఏమో ఏకంగా గ్రహాంతరవాసుల (ఏలియన్స్) కు గుడి కట్టాడు.
తమిళనాడులో సేలం జిల్లా మల్లమూపంబట్టికి చెందిన లోగనాథన్ ఏలియన్స్ గుడిని నిర్మించాడు. మూడు ఎకరాల భూమిలో గుడి నిర్మాణం చేపట్టాడు. 11 అడుగుల లోపల సెల్లార్లో శివుడు, పార్వతి, మురుగన్, కాళిమాత వంటి దేవతా విగ్రహాలు, ఏలియన్స్ ప్రతిమలను ప్రతిష్ఠించి రోజూ పూజలు నిర్వహిస్తున్నాడు.

ప్రపంచంలోనే ఏలియన్స్ కోసం నిర్మించిన మొదటి గుడి ఇది. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని తాను నమ్ముతున్నానని.. అందుకే గ్రహాంతరవాసుల కోసం తానే మొదటి ఆలయాన్ని నిర్మిస్తున్నానని లోగనాథన్ చెప్పాడు. అరటి ఆకును శరీరానికి చుట్టుకుంటే గ్రహాంతరవాసుల నుంచి వచ్చే రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చని .. అలాగే ఏలియన్స్ అనుమతి తీసుకునే వాటి గుడి కడుతున్నానని తెలిపాడు.
ప్రస్తుతం నిర్మాణ పనులు తుది దశలో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు సమీప గ్రామాల జనం తరలివస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ గుడికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పిచ్చి పదిరకాలు ఇంటే ఇదేనేమో అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇదేం భక్తిరా సామీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






