ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక ఇప్పుడు కేరళలో దుమారం రేపుతోంది. మాలీవుడ్ లో మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొనడంతో పలువురు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, చేదు అనుభవనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాలీవుడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, మలయాళీ ప్రేక్షకులు ప్రేమగా లాలెట్టా అని పిలుచుకునే మోహన్లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
మలయాళ చిత్రమండలి రద్దు..
మోహన్ లాల్ తో పాటు 17 మంది సభ్యులున్న మొత్తం పాలక మండలి పదవులకు గుడ్ బై చెప్పింది. ఈ మేరకు అమ్మ సంఘం ఇవాళ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ కమిటీలోని కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా రాజీనామా చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. మూకుమ్మడి రాజీనామాలతో మలయాళ చిత్రమండలిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు.
బాధితుల ఆరోపణలతో..
‘అమ్మ’ సంఘానికి మోహన్లాల్ అధ్యక్షుడిగా ఉండగా.. నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు ఈ కమిటీలో సభ్యులు. అయితే జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక వెల్లడైన తర్వాత పలువురు నటీమణులు కొందరు నటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపులకు గురి చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు.
దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేయగా.. తాజాగా అమ్మ సంఘం మొత్తం మూకుమ్మడి రాజీనామా చేసింది.