ManaEnadu:ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ డిక్టేటర్ పాలన గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆ దేశంలో కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఎప్పుడూ ప్రజలను తన గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న తప్పులకే ఘోర శిక్షలు విధిస్తుంటారు. కిమ్ కర్కశత్వానికి ఇప్పటికే చాలా మంది బలైపోయారు. తాజాగా కిమ్ శాడిజానికి ఏకంగా 30 మంది అధికారుల ప్రాణాలు పోయాయి. ఇంతకీ
ఏం జరిగిందంటే?
నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) రాజ్యంలో ఇటీవల భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. స్వయంగా తానే వెళ్లి వరద బీభత్సాన్ని పలుమార్లు కిమ్ పరిశీలించారుకూడా. అయితే తాజాగా ఆయన తమ దేశంలోని దాదాపు 30మంది ప్రభుత్వ అధికారులకు మరణ శిక్ష అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల వరదల (North Korea Floods) నేపథ్యంలో విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 20-30 (30 Officers Execution) మంది ప్రభుత్వ అధికారులకు కిమ్ గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా ఓ కథనంలో పేర్కొంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్లు ఆ కథనంలో వెల్లడించింది. శిక్ష అమలు వార్తలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ అధికారులు ఎవరన్న వివరాలు కూడా బయటకు రాకపోవడం గమనార్హం.
జులై-ఆగస్టు మధ్య ఉత్తరకొరియాలో కొన్నిరోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో వరదలు (Floods) సంభవించి అనేక ఊర్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో స్వయంగా కిమ్ రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాలను పర్యటించిన దృశ్యాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.