కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏప్రిల్ 2025 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఇవాళ (జనవరి 18) ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ మేరకు నేటి నుంచి 20న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు TTD వెల్లడించింది. వీటితోపాటు ఏప్రిల్ నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు TTD Onlineలో విడుదల చేయనుంది.
☛ అంగ ప్రదక్షిణం టోకెన్లు
అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఏప్రిల్ కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
☛ శ్రీవాణి ట్రస్టు టికెట్లు
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్లను ఏప్రిల్ నెల కోటా జనవరి 23న ఉదయం 11 గంటలకు TTD ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
☛ వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
☛ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది.
☛ తిరుమల, తిరుపతి గదుల కోటా
తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవారి సాధారణ సేవ కోటాను జనవరి 27న ఉదయం 11 గంటలకు, శ్రీవారి నవనీత సేవ కోటాను జనవరి 27న మధ్యాహ్నం 12 గంటలకు, శ్రీవారి పరాకామణి సేవ కోటా జనవరి 27న మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేస్తారు.
☛ బుకింగ్ కోసం సూచనలు
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, మరియు గదుల కోటాలను బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inను సందర్శించాలని సూచించింది.






