Mana Enadu: మృగాలు అంతరిస్తున్నాయని అన్నదెవరు.. మానవమృగాలు సంచరిస్తూ విస్తరిస్తున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కామంతో కావరమెక్కి పడగవిప్పి విచ్చలవిడిగా కాటేస్తూనే ఉన్నాయి. పరసంస్కృతి చరవాణిలో దిగుమతై మెదళ్లను కామక్రిములు తొలుస్తుంటే చెట్టుకు చీరచుట్టినా కళ్లతో కాల్చే రోజులు దాపురించాయి.జీవితం గుప్పెట్లో భద్రంగా దాచుకున్నా అపహరించి అమానుషంగా రక్కుతున్నాయి మానవ రాబందులు. కన్న పేగులకు కన్నీటి కానుకలిస్తున్నాయి. ఈ ఆడబిడ్డల బలత్కార రోదన కదులుతున్న కాలానికే తెలుసు. రేప్ చేస్తే మాఫీ చేసే ధనానికి లొంగే చట్టాలుండగా కామాంధులకి కఠిన శిక్షలెక్కడ? విశ్వగురులు పుట్టిన దేశంలో శాసనాలు చేసే మహిళల అధికారంలో మహిళ రక్షణ ఎక్కడ? తాజా కోల్కతా(Kolkata)లో వైద్యురాలి హత్యాచార ఘటనతో ప్రతి ఆడపడచు, వారి కన్న తల్లిదండ్రుల మదిలో మెదులుతోన్న ఆవేదన ఇదంతా..
ఆందోళనలతో మమత ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
ఇదిలా ఉండగా కోల్కతాలో జూనియర్ వైద్యురాలి(Junior Doctors)పై జరిగిన హత్యాచార ఘటన మమత ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో సీఎం మమత బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు విద్యార్థి సంఘాలు అక్కడి సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. కోల్కతాలో ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్(Chhatra Samaj)’ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్(Nabanna Abhijan)’ పేరుతో విద్యార్థులు భారీ ర్యాలీని చేపట్టారు.
హౌరా బ్రిడ్జి దగ్గర బైఠాయింపు
ఈ నేపథ్యంలో విద్యార్ధులకు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణ చెలరేగింది. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్లో పాల్గొన్న ఆందోళనకారులు.. బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేయడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా పరిస్థితి అదుపులోకి రావడంతో వారిపైకి భాష్ఫవాయువు ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. హౌరా బ్రిడ్జి( Howrah Bridge) దగ్గర బైఠాయించారు. అటు సీఎం మమతా బెనర్జీ(Chief minister Mamata Banerjee) నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినిపై ఆగస్టు 9న అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఇప్పటివరకు ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ఘోష్తో సహా ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించి వివరాలు సేకరించారు.