Mana Enadu : లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన తెలంగాణ డీఎస్సీ ఫలితాలను (Telangana DSC Results) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. 2.45 లక్షల మందికి పైగా ఈ పరీక్షలు రాశారు.
తొలిసారిగా ఆన్ లైన్ పరీక్ష
11 వేల 62 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ను ఈ ఏడాది మార్చి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 13వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి.. సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీని రిలీజ్ చేసింది.
మరో మూడు నెలల్లో నియామకాలు
ఇక తాజాగా ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల విడుదల అనంతరం ఖాళీల సంఖ్య ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీల (డీఎస్సీ)కు రాష్ట్ర విద్యాశాఖ రూపొందిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.






