Mana Enadu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (AP CM Chandrababu) సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. గురువారం రోజున ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (నవంబరు 16వ తేదీ) మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన (Nara Rammurthy Naidu Died) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.
నారా ఫ్యామిలీలో విషాదం
రామ్మూర్తి నాయుడి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. రామ్మూర్తి నాయుడు మరణంతో నారా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటన రద్దు (CBN Maharashtra Tour Cancelled) చేసుకుని హైదరాబాద్ బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు నారా కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు.
ఎమ్మెల్యేగా సేవలు
మరోవైపు నారా రామ్మూర్తి నాయుడు చంద్రబాబు నాయుడుకి సొంత తమ్ముడు. ఆయనకు ఇద్దరు కుమారులు టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohit), నారా గిరీష్ ఉన్నారు. 1952లో నారా కర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడిగా రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు పని చేశారు. రెండోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకున్నారు.






