
సంధ్యా దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించి అప్పటి నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైధ్య ఖర్చులన్నీ అల్లు అర్జున్తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఓ ఇంజెక్షన్ను ఖర్చకు వెనుకాడకుండా సింగపూర్ను నుంచి తెప్పించారని చెబుతున్నారు. ఇటీవల హీరో అల్లు అర్జున్ తాను 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హస్పటల్ ఖర్చులు, భవిష్యత్లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే. దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్, మైత్రీ నిర్మాలు, హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్ ఆరోగ్య అప్డేట్ను తెలుసుకుంటున్నారు.
అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీవాస్ తరుచుగా హస్పటల్కు కూడా వెళుతూ శ్రీతేజ్ యోగాక్షేమాలు కనుక్కుంటున్నారు. శ్రీతేజ్ పూర్తి ఆర్యోగంగా కోలుకునేవరకు హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్డేట్లను హీరో టీమ్ ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ ఆ సమాచారాన్ని కూడా అల్లు అర్జున్ కి చేరవేస్తున్నారని తెలుస్తోంది. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు అల్లు అర్జున్. బాలుడి ఆరోగ్యం గురించి ఎంతో సానుభూతితో ఉన్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నందును శ్రీతేజ్ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. వాళ్ల ఇంటికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నానని.. త్వరలో శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసి మాట్లాడతానన్నారు. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని అల్లు అర్జున్ తెలిపారు.