తగ్గేదేలే అంటూ బంగారం ధరలు (Gold Price Today) రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తులం పుత్తడి రేటు లక్ష రూపాయల వరకు చేరడం ఖాయం. అసలే ముందుంది శుభకార్యాల సీజన్. పెళ్లిళ్లు, పేరంటాలకు మగువల మెడలో తప్పక గోల్డ్ ఆభరణాలు ఉండాల్సిందే. అదో ప్రెస్టేజి ఇష్యూ మరి. కానీ ప్రస్తుతం పెరుగుతున్న గోల్డ్ ధరలు చూస్తుంటే ఈ సమయంలో అసలు పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితులు లేవు. దీంతో పెరుగుతున్న పుత్తడి రేట్లు చూసి సామాన్యులు జంకుతున్నారు. తులం గోల్డ్ ధర లక్ష రూపాయలు చేరితే ఇక బంగారం కొన్నట్టేనంటూ వాపోతున్నారు.
లక్షకు చేరువలో బంగారం
దేశవ్యాప్తంగా మరోసారి గోల్డ్ ధరలు (Gold Rate in Hyderabad) పెరిగాయి. మొన్న దాదాపు రూ.2వేల వరకు పెరిగిన పసిడి రేట్లు తాజాగా వేయి వరకు పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా సోమవారం నాడు బంగారం ధరలు రూ.98వేల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఆదివారం రోజున రూ.97,580 ఉండగా సోమవారం నాటికి రూ.770 పెరిగి ప్రస్తుతం రూ.98,350 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర నిన్న రూ.89,450 ఉండగా ఇవాళ రూ.700 పెరిగి రూ.90,150 వద్ద కొనసాగుతోంది.
గోల్డ్ బాటలోనే వెండి
ఇక గోల్డ్ తో పాటు వెండి ధరలు (Silver Rate Today) కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఆదివారం రోజు కిలో వెండి ధర రూ.98,300 ఉండగా, సోమవారం నాటికి రూ.225 పెరిగి రూ.98,525కు చేరుకుంది. ఈ ధరలతో బంగారం, వెండి కొనుగోలు చేసే పరిస్థితులు లేవని సామాన్యులు వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందు ఉండటంతో గోల్డ్ కొనడం తప్పనిసరిగా మారింది. అయితే ధరలు చూస్తేనేమో మండిపోతున్నాయి. అయినా కొనుగోలు చేయడం తప్పదు. దీంతో సామాన్యులు ఈ రేట్లు ఇలాగే కొనసాగితే కష్టం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






