భారత్, పాకిస్థాన్(India vs Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్ఎం రేడియో(FM Radio) స్టేషన్లలో భారతీయ పాటల(Indian Songs) ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (PBA) ప్రకటించింది. ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ సంగీతానికి అక్కడ చాలా ఆదరణ
ఈ విషయాన్ని పీబీఏ సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్(PBA Secretary General Shakeel Masood) గురువారం అధికారికంగా వెల్లడించారు. “పాకిస్థాన్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీ FM రేడియో స్టేషన్లలో ఇండియన్ సాంగ్స్ ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసింది” అని ఆయన తెలిపారు. వాస్తవానికి, లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ముఖేష్ వంటి దిగ్గజ గాయకుల పాటలతో సహా భారతీయ సంగీతానికి పాకిస్థాన్లో ఎంతో ఆదరణ ఉంది. అక్కడి FM రేడియోలలో ప్రతిరోజూ మనసాంగ్స్ ప్రసారమవుతుంటాయి. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో ఇరుదేశాలూ ఆంక్షలు విధించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ తాజా నిర్ణయం వారిపై వారే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.








