2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్లపై నిషేధం విధించింది. టిక్టాక్(TikTok), అలీ ఎక్స్ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి ప్రముఖ యాప్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారం, రక్షణ, ప్రజా క్రమానికి భంగం కలిగించే అవకాశముందనే కారణంతో మొత్తం 58 యాప్లను జూన్ 2020లో బ్యాన్ చేశారు.
ఇటీవల భారత్–చైనా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ యాప్లు తిరిగి భారత మార్కెట్లోకి(TikTok Returned to India) వస్తున్నాయన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా టిక్టాక్ రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ఊహాగానాలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. చైనా యాప్లపై విధించిన నిషేధం కొనసాగుతుందని, టిక్టాక్ తో సహా అలీ ఎక్స్ప్రెస్, షీన్ మళ్లీ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా వాస్తవం కాదని ప్రభుత్వం తెలిపింది. పౌరుల డేటా భద్రతకు హాని కలిగించే యాప్లకు భారత్లో స్థానం లేదని మరోసారి స్పష్టం చేసింది. అందువల్ల, చైనా యాప్లు రీ ఎంట్రీ ఇస్తాయన్న వార్తలు కేవలం అపోహలేనని తేలింది.






