ManaEnadu:హిందువులు కన్నులపండువగా జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. విష్ణుమూర్తి 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని పూరాణాలు చెబుతున్నాయి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో బాల గోపాలుడి జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ ఏడాది కృష్ణాష్టమి ఏ రోజున వచ్చింది? కొంతమంది ఆగస్టు 26 అంటున్నారు. ఇంకొంతమందేమో 27వ తేదీన పండుగ అంటున్నారు. మరి పండితులు ఏం చెబుతున్నారంటే?
కృష్ణాష్టమి ఎప్పుడు?
అసలు ఈ రెండ్రోజుల గురించి చర్చ ఎందుకు జరుగుతోందంటే?.. ఈ తిథి రెండు రోజులను కలుపుతూ వచ్చింది. పంచాంగం ప్రకారం కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమై, 27వ తేదీ తెల్లవారుజామున 2:19 గంటలకు ముగుస్తుంది. రోహిణి నక్షత్రం ఆగస్టు 26 మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది.
అయితే కృష్ణాష్టమి స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమి అని రెండు రకాలుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజున, వైష్ణవ సంప్రదాయం పాటించే వారు ఆగస్టు 27 మంగళవారం రోజున కృష్ణాష్టమిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. కృష్ణాష్టమికి రెండు తేదీలు ఉండడానికి స్మార్తులకు, వైష్ణువులకు సిద్ధాంతాలు వేరుగా ఉండడమే కారణమని అంటున్నారు. మరోవైపు కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, 2024, ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాల మధ్యలో కృష్ణుడి పూజ చేసుకోవాలని పండితులు తెలిపారు.








