మహేశ్ బాబు (Mahesh Babu)తో ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajmouli) వైల్డ్ అడ్వెంచర్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ ను గతంలోనే ప్రకటించారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. చిన్న అప్ డేట్ వచ్చినా సంబురపడిపోతున్నారు. ఈ మూవీలో కీలక రోల్ లో యాక్ట్ చేస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన నటించిన ‘సర్జమీన్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
SSMB29 ఓ విజువల్ ట్రీట్..
“ఎవరూ ఊహించనిరీతిలో SSMB29 కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. అదొక అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి సర్ ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ప్రతిఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ సినిమాను విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దుతున్నారు” అని పృథ్వీరాజ్ అన్నారు. ప్రస్తుతం #SSMB29 షూటింగ్ కు విరామం ఇచ్చారు.
సగటు ప్రేమికుడి కోణం నుంచి చూస్తా..
కథల ఎంపికలపై పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. “సినిమా కథల ఎంపిక విషయంలో నేనెప్పుడూ ముక్కుసూటిగా ఉంటా. ఏదైనా స్క్రిప్ట్ ను నటుడిగా, ఫిల్మ్ మేకర్ గా కాకుండా సగటు సినీ ప్రేమికుడి కోణం నుంచి చూస్తాను. నాకు సరిపోతుంది అనుకున్న తర్వాతే ఓకే చెబుతా. నాకు నచ్చక చాలా కథలు చేయనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ‘సర్ జమీన్’కు నో చెప్పడానికి ఒక్క అంశం కూడా కనిపించలేదు. సినిమా తీసే విషయంలో దర్శకుడికి స్పష్టత ఉందా? లేదా? అనేది కూడా కచ్చితంగా చూస్తా’ ‘సర్ జమీన్’ జులై 25 నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.






