తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(AP)లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Counting of MLC Election Votes)ను ఇవాళ చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ(TG)లోని కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన MLC ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు జరిగిన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం(Ambedkar Indoor Stadium)లో ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేసేందుకు 800 మంది ఉద్యోగులు చేపట్టనున్నారు.
హోరాహోరీ పోరు తప్పదా?
పట్టభద్రుల MLC స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, BJP నుంచి అంజిరెడ్డి, BSP అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్సింగ్ సహా 56 మంది పోటీ చేశారు.ఇక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీపడగా.. 24,968 ఓట్లు లెక్కించాల్సి ఉండడంతో సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఫలితం వెలువడే అవకాశముంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఆర్జాలబావి వద్ద స్టేట్వేర్ హౌసింగ్ గోదాముల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.



ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు..
ఇక ఏపీలోని రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల MLC స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. రెండు పట్టభద్రుల స్థానాల్లో TDP నాయకులతోపాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో TDP పక్షాన పేరాబత్తుల రాజశేఖరం, PDF అభ్యర్థి దిడ్ల వీర రాఘవుల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా ఉంది. ఏలూరులోని CR రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో 2,18,902 ఓట్లను లెక్కించనున్నారు.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాలలో జరగనుంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా 20,794 మంది(92.45%) ఓటు వేశారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలితే సాయంత్రం 6 గంటల తర్వాత విజేత పేరు ప్రకటిస్తారు.






