ఏపీలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న Mega DSC Exams ఇవాళ్టి (జూన్ 6) నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఆన్లైన్(Online) విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. కాగా 90 నిమిషాల ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లో(Exam Centres)కి అనుమతించనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత
గత అనుభవాల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు ఈసారి గట్టి నిబంధనలు అమలు చేయనున్నారు. ముఖ్యంగా “నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వదు” అని DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి(Convener Venkata Krishna Reddy) స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవడం, హాల్ టికెట్(Hall-Ticket) సహా అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సకాలంలో సిద్ధం చేసుకోవడం అభ్యర్థుల బాధ్యత. ఇది ఒక మెరుగైన నిర్వహణ కోసం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యగా భావించవచ్చు.
హాల్ టికెట్లో ఫొటో లేకపోతే..
హాల్ టికెట్పై అభ్యర్థి ఫొటో ముద్రించబడకపోతే, అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్లో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులుంటే, ఆ తప్పులను ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డుల ఆధారంగా సరిచూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అన్ని అంశాలను సరిచూసుకొని, పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్న నేపథ్యంలో, అనేకమందికి ఇది కీలక అవకాశంగా మారింది. కాగా మొత్తం 16,347 పోస్టులకు 3,36,305 మంది అభ్యర్థులు.. 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారన్నారు.








