
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన ఈ నెల 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి తనకు స్వాగతం పలకడానికి వచ్చిన గిరిజన మహిళకు చెప్పులు లేకుండా రావడం ఆయన గమనించారు. మండుటెండలో తనను కలిసేందుకు వచ్చిన ఆ మహిళను చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు.
345 మందికి పాదరక్షలు
ఈ క్రమంలో ఆ గిరిజనులకు పవన్ కళ్యాణ్ చెప్పులు (Cheppals) పంపించారు. ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి.. గ్రామంలో మొత్తం ఎంత మంది ఉంటారో ఆరా తీయించి.. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్వే నివేదిక రావడంతో గురువారం రోజున ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం.
థాంక్యూ పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి కార్యాలయ (AP Deputy CM Office) సిబ్బంది బోయిపల్లి పవన్తోపాటు బృంద సభ్యులు, స్థానిక సర్పంచి వెంకటరావు గురువారం రోజున ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి అందరికీ చెప్పులు పంపిణీ చేశారు. తమ కష్టం చూసి తమకు పాదరక్షలు పంపించిన డిప్యూటీ సీఎంకు ఆ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామానికి ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాము చెప్పకుండానే తమ కష్టాన్ని అర్థం చేసుకున్నారని అన్నారు.