
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో బంగారం టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా పసిడి ధరల గురించే చర్చంతా. ఇంకొన్ని రోజుల్లో గోల్డ్ రేటు (Gold Price Today) లక్ష రూపాయలు దాటుతుందట కదా అని కొందరంటే.. లేదు లేదు.. కొన్ని రోజులు ఆగు.. మళ్లీ రూ.50వేలకు దిగొస్తుంది పుత్తడి రేటు అంటు మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దిగొచ్చే సంగతి అటుంచితే గోల్డ్ ధరలు మరికొన్ని రోజుల్లో ఆకాశాన్నంటనున్నాయి. మరో వారం రోజుల్లో పసిడి రేట్లు లక్ష రూపాయలకు చేరుకుంటాయని ప్రస్తుత మార్కెట్ ధరలు చూస్తే అర్థమైపోతోంది.
పసిడి ధరలకు రెక్కలు
భారతీయులకు బంగారానికి మధ్య ఎనలేని అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం పెరుగుతున్న పుత్తడి రేట్లు చూసి భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ముందు శుభకార్యాల సీజన్ ఉండటంతో ఈ సమయంలో రేట్లు పెరుగుతుండటంతో గోల్డ్ (Gold Rates Today) ఎలా కొనుగోలు చేసేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో బంగారం కొనేలా లేమని వాపోతున్నారు. మరోవైపు కొన్ని రోజుల్లో లక్ష రూపాయలకు బంగారం రేట్లు చేరుతాయన్న వార్తలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.
స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు
భారతదేశంలో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే క్రితం రోజున దాదాపు రూ.1500 వరకు పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ పది రూపాయలు మాత్రమే పెరుగుదల కనిపించింది. గురువారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.97,310 ఉండగా శుక్రవారానికి రూ.10 పెరిగి ప్రస్తుతం రూ.97,320 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ తులం రేటు గురువారం నాడు రూ. 89,200 ఉండగా ఇవాళ రూ.89,210 వద్ద అమ్ముడుపోతోంది. ఇక వెండి రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో సిల్వర్ (Silver Rates Today) రూ. 1,09,900 వద్ద విక్రయిస్తున్నారు.